24 గంటల్లోనే కిడ్నాప్‌ కథ సుఖాంతం

20 Oct, 2020 09:07 IST|Sakshi

తల్లికి మాయమాటలు, చిన్నారి కిడ్నాప్‌

సాక్షి, యాదాద్రి భువనగిరి: భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఓ మహిళకు మాయమాటలు చెప్పిన దుండగులు ఆమె మూడేళ్ల కుమార్తెను కిడ్నాప్‌ చేశారు. భువనగిరి పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది.

హైదరాబాద్ ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో చిన్నారితో కలిసి బస్‌ దిగిన మహేశ్వరిని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమె భర్త రాజు దగ్గరకు తీసుకెళ్తామని చెప్పి భువనగిరికి తీసుకొచ్చారు. మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించారు. మహేశ్వరి స్పృహ తప్పగానే బాలికను అపహరించుకుపోయారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన 24 గంటల్లో కేసును ఛేదించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. చిన్నారి క్షేమంగా ఉందని పేర్కొన్నారు.
(చదవండి: మానుకోటలో బాలుడి కిడ్నాప్‌)

మరిన్ని వార్తలు