Hyderabad: పోలీసుల చలాన్లపై వాహనదారులు గరంగరం.. మైత్రివనంలో హైటెన్షన్‌!

3 Oct, 2022 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో​ ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్‌ చలాన్లపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. 

తమ బైక్‌లపై ట్రాఫిక్‌ చలాన్‌ విధించారని మైత్రివనం దగ్గర ట్రాఫిక్‌ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బైక్‌ స్టాప్‌లైన్‌ను దాటించాడని బైక్‌పై పోలీసులు చలాన్‌ విధించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన బైకర్‌.. తన బైక్‌కు తానే నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు.  కాగా, పోలీసులు నగరంలో చాలాచోట్ల ట్రాపిక్‌ నిబంధనలు పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీల్లో పాత చల్లాన్లు ఉంటే కట్టాలని కూడా కోరుతున్నట్టు సమాచారం.

అయితే, సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో  కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కొత్త రూల్స్ ఇవే..
► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా
► ఫ్రీ  లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా
► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా  పార్క్ చేసినా జరిమానా విధిస్తారు. 
 

మరిన్ని వార్తలు