భూసారాన్ని కాపాడితేనే ఆరోగ్యం

22 Feb, 2023 04:43 IST|Sakshi
సేంద్రియ ఎరువును పరిశీలిస్తున్న  మంత్రి హరీశ్‌రావు  

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

‘సిద్దిపేట కార్బన్‌ లైట్స్‌’ సేంద్రియ ఎరువు విడుదల 

సాక్షి, సిద్దిపేట: ‘భూమి బాగుంటే మనిషి బాగుంటాడు. రసాయనిక ఎరువులు ఎక్కువ వినియోగించడంతో సమాజంలో కేన్సర్‌ వేగంగా విస్తరిస్తోంది. భూ సారాన్ని కాపాడుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం’ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్‌ ఆవరణలో  భూ మిత్ర.. మన తడిచెత్త–మన సేంద్రియ ఎరువు – మన నేల అనే నినాదంతో ‘సిద్దిపేట కార్బన్‌ లైట్స్‌’  సేంద్రియ ఎరువును మార్కెట్‌లోకి మంగళవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది సిద్దిపేట మున్సిపాలిటీలోని 41,322 మంది ప్రజల విజయమన్నారు. ఇదంతా నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్,  జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణ శర్మ, పర్యావరణవేత్త డాక్టర్‌ శాంతి పాల్గొన్నారు. 

తొలి బ్యాగ్‌ కొన్న మంత్రి..  
సిద్దిపేట బ్రాండ్‌తో తయారైన జీవ సంపన్న సేంద్రియ ఎరువు తొలి బ్యాగును మంత్రి హరీశ్‌రావు కొనుగోలు చేశారు. సిద్దిపేట శివారులోని తన పొలంలో వినియోగించేందుకు  రూ.37వేలు చెల్లించి 125 బ్యాగుల ఎరువును కొనుగోలు చేశారు.
మా భూమి సారం పెరిగింది సార్‌ మాది చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామం. నా పేరు కృప
మంత్రి హరీశ్‌రావు: ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మ? 
కృప:
నాకు నాలుగెకరాల భూమి ఉంది. మూడున్నర ఎకరాల్లో వరి, అరెకరంలో కూరగాయలు సాగు చేస్తున్న.  
మంత్రి: సేంద్రియ ఎరువుతో సాగు చేస్తున్నావా? 
కృప: అవును సార్‌.. ఆరు నెలల నుంచి సేంద్రియ ఎరువుతోనే పండిస్తున్న. 
మంత్రి: ఇప్పటివరకు ఎన్ని బస్తాలు తీసుకున్నావు  
కృప: శాంపిల్‌గా ఇచ్చిన 25 బస్తాలను తీసుకున్నాను సార్‌. సేంద్రియ ఎరువుతో సాగు చేయడంతో మార్కెట్‌లో మా కూరగాయలకు బాగా డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల చిక్కుడు కాయ తెంపినం. మార్కెట్‌లో అందరూ కిలో రూ.35కు అమ్మితే నేను రూ.40కిలో అమ్మాను. 
మంత్రి: నీకు ఆదాయం పెరగడంతో పాటు  ఆరోగ్యం కాపాడుతున్నావు అమ్మ. శభాష్‌.. 

మరిన్ని వార్తలు