బండి సంజయ్‌ పాదయాత్ర 28కి వాయిదా

23 Aug, 2021 08:53 IST|Sakshi

యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ మృతితోనేనన్న పార్టీ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28కి వాయిదా పడింది. బీజేపీ సీనియర్‌నేత, మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ మృతి నేపథ్యంలో పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నందున పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్‌ ఇండియా దినోత్సవం ఆగస్ట్‌ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించగా..పార్లమెంట్‌ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ, ఓటింగ్‌ వంటి అంశాల నేపథ్యంలో ఈ నెల 24కు వాయిదా వేశారు.

తాజాగా కల్యాణ్‌సింగ్‌ మరణంతో నాలుగురోజుల పాటు మరోసారి పాదయాత్ర వాయిదా పడినట్లైంది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన బండి సంజయ్‌ ఈ అంశంపై చర్చించారు. ఈనెల 28 శనివారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు చారి్మనార్‌ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్‌లతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు