మునుగోడు మనదే!

13 Aug, 2022 03:26 IST|Sakshi
 యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో ప్రజాసంగ్రామ యాత్రలో చిన్నారిని ఎత్తుకున్న బండి సంజయ్‌  

బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జుల సమావేశంలో బండి సంజయ్‌

హామీలు అమలు చేయని టీఆర్‌ఎస్‌ ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది?

కాంగ్రెస్‌ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలవాలి: తరుణ్‌ చుగ్‌

సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి: తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నిక మునుగోడులో జరగబోతోందని.. ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధి కారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక్కో మోదీగా మారి బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంజయ్‌ పాదయాత్ర సాగింది.

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, మరికొందరు సీనియర్‌ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని కొంత దూరం నడిచారు. మధ్యాహ్నం ఎన్నారంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర భోజన శిబిరం వద్ద బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జులతో సంజయ్, తరుణ్‌ చుగ్, ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికలో ఓటుకు రూ.30 వేలు, మద్యం పంచేందుకు టీఆర్‌ఎస్‌ సర్వం సిద్ధం చేసుకుంటోందని బండి సంజయ్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా బోల్తాపడ్డారని గుర్తుచేశారు.

గెలుపు ఖాయమైనట్టే..
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఇప్పటికే ఖాయమైందని సంజయ్‌ పేర్కొ న్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆటలు సాగబోవన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పదన్నారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చే పైసలకు ఆశ పడి సీపీఐ నేతలు ఇప్పటికే పొత్తుకు సిద్ధమ య్యారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్‌ కేడరే ఆ పార్టీ నాయకత్వంపై కోపంతో ఉందని, ఆ పార్టీ నేతలు కొట్లాడుకోవడమే తప్ప తమకు పోటీ కాదని పేర్కొన్నారు.

ఉప ఎన్నిక సమ యంలో తాను మునుగోడులోనే మకాం వేస్తానని చెప్పారు. మునుగోడు నియోజక వర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఈ నెల 21న సభ జరుగుతుందని సంజయ్‌ స్పష్టం చేశారు. ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్‌ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు.

మహిళా సాధికారతకు తోడ్పాటు
మహిళా సాధికారతకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రపతి పీఠంపై ఎస్టీ మహిళను కూర్చోబెట్టడంతోపాటు ఆరుగురు మహిళ లకు గవర్నర్‌లుగా, నలుగురికి సీఎంలుగా, 12 మందిని కేంద్ర మంత్రులుగా చేశారని సంజయ్‌ చెప్పారు. అదే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కారు తొలి ఐదేళ్లు ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు.

జనం కసితో ఉన్నారు: తరుణ్‌ చుగ్‌
మునుగోడులో బీజేపీ విజయానికి అవసర మైన వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు తరుణ్‌ చుగ్‌ సూచించారు. మునుగోడులో బీజేపీ గెలిచి తీరాలన్నారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్‌ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు హనుమంతుడి వారసులుగా మారి కేసీఆర్‌ కోటను కూల్చేయాలని పిలుపునిచ్చారు.

15 కిలోమీటర్లు యాత్ర
శుక్రవారం సంజయ్‌ పాదయాత్ర పల్లివాడ స్టేజీ నుంచి ఎన్నారం, పెద్దబావిగూడెం, కుంకుడుపాముల, పల్లెపహాడ్‌ క్రాస్‌రోడ్డు, పెరు మాండ్లబావి మీదుగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వరకు 15 కిలోమీటర్ల మేర సాగింది. రాఖీ పండుగ కావడంతో దారిపొడవునా మహిళలు సంజయ్‌కు రాఖీలు కట్టారు.

మరిన్ని వార్తలు