దారిపొడవునా ఘనస్వాగతం

2 Jul, 2022 02:25 IST|Sakshi
ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌ వరకు జేపీ నడ్డా రోడ్‌ షో. (ఇన్‌సెట్‌)లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నడ్డాకు స్వాగతం పలుకుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

ఎయిర్‌పోర్ట్‌ నుంచి శంషాబాద్‌ వరకు నడ్డా రోడ్‌షో   

సాక్షి, రంగారెడ్డి/శంషాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు రోజంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ఐదున్నరకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.

భారీ కాన్వాయ్‌తో ఎయిర్‌పోర్ట్‌ నుంచి శంషాబాద్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, మహిళలు కోలాటం, డప్పువాద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకగా, ప్రత్యేక వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 40 నిమిషాలు ర్యాలీ సాగింది. ఆపై నడ్డా నోవాటెల్‌కు వెళ్లిపోయారు. నడ్డా వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల, పార్టీ జాతీయ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహ్వేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్‌ అందెల శ్రీరాములు, తూళ్ల వీరేందర్‌గౌడ్‌ సహా పలువురు నేతలు ఉన్నారు.

మరిన్ని వార్తలు