మోదీని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు: బీజేపీ లక్ష్మణ్‌

25 Apr, 2022 13:23 IST|Sakshi

తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల వ్యూహకర్త చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

లక్ష్మణ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీని మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదని పీకే(ప్రశాంత్‌ కిషోర్‌) లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ బి టీం.  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలవి చీకటి ఒప్పందాలు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రధాని మోదీని ఏమీ చేయలేరు. మూడో సారి కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. 

మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారు. పీకేతో భేటీ తర్వాత  కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పీకే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌తో కేసీఆర్ పనిచేయబోతున్నారు. పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. తెలంగాణ ప్రజలు నమ్మరు. 
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. టీఆర్ఎస్‌కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తేలియదా..? బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్‌ ఓర్వలేకపోతున్నారు.’’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: కరప్షన్‌.. కలెక్షన్‌.. కేసీఆర్‌..! : ఆర్‌ఎస్పీ 

మరిన్ని వార్తలు