‘టీఆర్‌ఎస్‌తో ఏ దోస్తీ లేదు’

18 Dec, 2020 09:17 IST|Sakshi

గత ప్రభుత్వాల్లో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌లే మిత్రపక్షాలు: కిషన్‌రెడ్డి

21న రాష్ట్రంలోని రూ.3,717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులు దేశానికి అంకితం

రూ.9,440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు కేంద్రమంత్రి గడ్కరీ భూమి పూజ 

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్తో బీజేపీకి ఏ దోస్తీ లేదని, ప్రజా సమస్యలపై వారితో కుస్తీ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ ‘గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’అన్నట్లుగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్‌ విమర్శలను తప్పుబట్టారు. గత ప్రభుత్వాల్లో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పారీ్టలే మిత్రపక్షాలుగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌ నాయకులకు చురకలంటించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా అనేక జాతీయ రహదారులు అభివృద్ధికి నోచుకోవట్లేదని, త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నెల 21న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రంలోని 370 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రూ.3,717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటే రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవున రూ.9,440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు భూమి పూజ చేసి పునాది రాయి వేయనున్నారని వెల్లడించారు. భారతమాల పరియోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 35 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి జరుగుతున్నాయని, ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు.  

దేశానికి అంకితం చేయనున్న 6 ప్రాజెక్టులివే.. 
1) జాతీయ రహదారి–163పై యాదగిరిగుట్ట–వరంగల్‌ మధ్య నిర్మించిన 99 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి. 2) జాతీయ రహదారి 163పై మన్నెగూడ–రావులపల్లి మధ్య నిర్మించిన 73 కి.మీ. రెండు లేన్ల రహదారి. 3) వరంగల్‌ జిల్లాలో జాతీయ రహదారి–163పై 35 కి.మీ. రహదారి విస్తరణ. 4) వరంగల్‌ జిల్లాలో జాతీయ రహదారి–353సీపై 34 కి.మీ. మేర రెండు లేన్లలో క్యారేజ్‌వే విçస్తరణ. 5) హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి ఎన్‌హెచ్‌–765డీలోని మెదక్‌ సెక్షన్‌ వరకు 63 కిలోమీటర్ల రహదారి విస్తరణ. 6) నకిరేకల్‌ నుంచిæ ఎన్‌హెచ్‌–365లోని తనంచెర్ల వరకు చేసిన 67 కిలోమీటర్ల రహదారి విస్తరణ. 

భూమి పూజ జరగనున్న 8 ప్రాజెక్టులివే.. 
1) జాతీయ రహదారి–161పై కంది నుంచి రామ్‌సన్‌పల్లె వరకు 40 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 2) జాతీయ రహదారి–161పై రామ్‌సన్‌పల్లె నుంచి మంగ్లూరు వరకు 47 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 3) జాతీయ రహదారి–161పై మంగ్లూరు నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 4) జాతీయ రహదారి–363పై రేపల్లెవాడ నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 53 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 5) జాతీయ రహదారి–363పై మంచిర్యాల నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు 42 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 6) జాతీయ రహదారి–365బీబీపై సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 59 కి.మీ. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం. 7) నిర్మల్‌ జిల్లాలో జాతీయ రహదారి–61పై నిర్మల్‌–ఖానాపూర్‌ మధ్య 22 కి.మీ. రెండు లేన్ల రహదారి విస్తరణ, బలోపేతం. 8) నల్లగొండ జిల్లాలో 2020–21 సంవత్సరానికి ఎన్‌హెచ్‌ (ఓ) కింద నకిరేకల్‌ నుంచి ఎన్‌హెచ్‌–565పై నాగార్జునసాగర్‌ వరకు 85 కి.మీ. మేర రహదారి పెండింగ్‌ పనుల పూర్తి.   

మరిన్ని వార్తలు