ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ దాడి

3 Nov, 2020 08:03 IST|Sakshi
సోమవారం రాత్రి సిద్దిపేటలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ బస చేసిన లాడ్జి వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ

సిద్దిపేట లాడ్జిలో క్రాంతి కిరణ్, వేముల వీరేశం బస

లాడ్జిలోకి దూసుకొచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సహా 30 మంది కార్యకర్తలు

ఇనుపరాడ్లతో దాడి.. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే డ్రైవర్‌కు గాయాలు

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నాం: ఏసీపీ

సాక్షి, సిద్దిపేట:  సిద్దిపేటలోని ఒక లాడ్జిలో బస చేసిన అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సోమవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు..  దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు తొగుట మండల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఆదివారం వరకు తొగుటలో ప్రచారం నిర్వహించిన క్రాంతి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి సిద్దిపేటలోని ఓ లాడ్జిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి మరో 30 మంది కార్యకర్తలతో కలసి క్రాంతి ఉండే గది తలుపు నెట్టారు. (చదవండి:‌ సరిహద్దులు దాటి రయ్‌.. రయ్‌)

లోపల ఉన్న క్రాంతి.. మీరు ఎవరు అని ప్రశ్నించగా.. మారు మాట్లాడకుండా తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో మూకుమ్మడిగా దాడికి దిగారు. ఎమ్మెల్యే క్రాంతిపై దాడి చేస్తుండగా పక్కనే ఉన్న డ్రైవర్‌ సైదులు అడ్డుకునేందుకు యతి్నంచాడు. దీంతో అతని చేతికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన సైదులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ తెలిపారు. (చదవండి: ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

 ఏసీపీ విశ్వప్రసాద్‌కు ఘటన గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే క్రాంతి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి   

ఓటమి భయంతోనే: మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక ఉప ఎన్నికల్లో ముందే ఓటమిని పసిగట్టిన బీజేపీ.. ఓర్వలేక తమ పార్టీ ఎమ్మెల్యే పై దాడికి దిగడం హేయమైన చర్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసిన బీజేపీ నాయకులు జీరి్ణంచుకోలేక పోతున్నారని, అందుకే భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వీరేశంపై దాడి చేయడం శోచనీయమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఉండకూడదనే నిబంధన మేరకు క్రాంతి, వీరేశం సిద్దిపేటలో ఉన్నారని హరీశ్‌ తెలిపారు. ఒంటరిగా ఉన్న ఎమ్మెల్యేపై ఒకేసారి 30 మంది దాడి చేయడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు ఖాయమని, దాడులు చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బీజేపీ నాయకులకు ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు.   

నాపైనే దాడి  చేశారు..
సిద్దిపేట పట్టణంలోని ఓ లాడ్జికి రూం కోసం వెళ్లిన తనపైనే ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వీరేశంలు దాడికి పాల్పడ్డారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించా రు. ఆందోల్‌ ఎమ్మెల్యేకు సిద్దిపేటలో ఏం పని? అని ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు కూడా తన మీదే కేసు నమోదు చేశారని ఆక్షేపించారు.  

మరిన్ని వార్తలు