స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సెషన్‌ మొత్తం అసెంబ్లీ నుంచి ఈటల సస్పెండ్‌

13 Sep, 2022 10:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య జరుగుతున్న వాడీవేడి వాగ్వాదాలు.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా మూడో రోజు సమావేశాల్లో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ సెషన్‌ మొత్తానికి సస్పెన్షన్‌ వర్తిస్తుందని స్పీకర్‌ ప్రకటించారు. ఆ సమయంలో ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. అయితే స్పీకర్‌ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు.

ఇదిలా ఉంటే.. ‘స్పీకర్‌పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.  ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ కోరారు.

‘స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్‌ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి

మరిన్ని వార్తలు