కమలంలో లుకలుకలు! 

7 Mar, 2021 10:47 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బంజారాహిల్స్‌: కేబీఆర్‌ పార్కు వేదికగా బీజేపీలో నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద శనివారం వాకర్లను ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ కూడా వచ్చారు. చింతల రావడంతోనే అప్పటికే అక్కడికి వచ్చిన పార్టీ నేత గోవర్ధన్‌ను పక్కకు జరగాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గోవర్ధన్‌ చింతలపై విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాహాబాహికి దిగేందుకూ యత్నించారు.

కాగా,పరిస్థితి చేయిదాటుతుండటంతో వెంట నే పక్కనే ఉన్న నేతలు కలగజేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. మొన్నటి కార్పొరేటర్‌ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకుండా తనను మోసం చేశారని పల్లపు గోవర్ధన్‌ కోపంతో ఉన్నారు. దీంతో చింతలతో విభేదాలు తలెత్తాయి.

మరిన్ని వార్తలు