‘సాలు దొర–సెలవు దొర’

26 Jun, 2022 01:40 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అమర్చిన డిజిటల్‌ స్క్రీన్‌ కౌంట్‌డౌన్‌ గడియారం

కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌ వెబ్‌సైట్‌ షురూ

బీజేపీ కార్యాలయం వద్ద డిజిటల్‌ స్క్రీన్‌ కౌంట్‌డౌన్‌ గడియారం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ వినూత్న రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమి షాలు, సెకన్లను కౌంట్‌డౌన్‌గా చూపుతూ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ‘‘సాలు దొర–సెలవు దొర’... కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌’అంటూ డిజిటల్‌ గడియారం లైవ్‌ డిస్‌ప్లేను నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం గేటు పక్కన ఏర్పాటు చేశారు.

ఈ స్క్రీన్‌పై ‘సాలు దొర, సెలవు దొర’అనే నినాదాలతో సీఎం కేసీఆర్‌ ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో ఈ ‘వెబ్‌ క్యాంపెయిన్‌’ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రారంభించారు. ‘ఈ డిజిటల్‌ స్క్రీన్‌ను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో, బీజేపీ నిర్వహించే ప్రతీ కార్యక్రమాల్లోనూ ఏర్పాటు చేస్తాం.

ఈ గడువు ముగిసేదాకా సంజయ్‌ నేతృత్వంలో నేతలు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తారు. ఇక చాలు గద్దె దిగండి.. బీజేపీ వస్తోందని నినదిస్తారు’అని పేర్కొన్నారు. 529 కౌంట్‌డౌన్‌ తర్వాత ఏమి జరగబోతుం దని మీడియా ప్రశ్నించగా 530వ రోజున తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఆయన బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు