బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌

26 Oct, 2020 20:51 IST|Sakshi

సాక్షి, దుబ్బాక : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్ధిపేట వెళుతున్న ఆయనను పోలీసులు మధ్యలోనే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడం, సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఈ అనైతిక దాడులను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దుబ్బాక శాసనసభకు ఎన్నిక జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వపు దుందుడుకు చర్యగా అభివర్ణించారు.

మరోవైపు  రఘునందన్‌రావు మామ గోపాల్‌రావుతో పాటు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేశారు. ఈ సందర్భంగా రూ.18.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కెళ్లారు. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా డబ్బులు లాక్కెళ్లిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్ డేవిడ్ మాట్లాడుతూ నగదు దొంగిలించినవారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు