మెడికల్‌ పీజీ ‘బ్లాక్‌’ దందా!

19 Apr, 2022 04:55 IST|Sakshi

ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిసి ప్రైవేట్‌ కాలేజీల కుటిల ప్రయత్నాలు

ఒక్కో సీటుకు రూ.2 కోట్ల దాకా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు

మెరిట్‌ వచ్చినా సీటు దక్కించుకోలేక పోతున్న స్థానిక విద్యార్థులు

40 మంది అనుమానాస్పద దరఖాస్తులతో కదిలిన సర్కారు 

పోలీసులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌:  వైద్య విద్యలో స్పెషలైజేషన్‌ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్‌’ దందా నడుస్తోంది. ప్రైవే టు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గం పట్టాయి. ‘నీట్‌’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్‌మెంట్‌ కోటా సీటు అలాట్‌ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం.. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును అడ్డగోలు ‘రేటు’కు అమ్ముకుని భారీగా వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. దీనివల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

లొసుగును వాడుకుని.. 
మెడికల్‌ కాలేజీల్లో దందాలకు చెక్‌ పెట్టేందుకు దేశంలో ‘నీట్‌’ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పి స్తున్నారు. అయినా నిబంధనల్లో ఉన్న లొసుగులను వాడు కుని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మెడికల్‌ పీజీ సీట్లను అమ్ముకుంటున్నాయి. ఇందుకోసం పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ‘నీట్‌’ పరీక్ష వల్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్‌మెంట్‌ సీట్లకు పోటీపడొచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం  నీట్‌ ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను విడుదల చేసింది.

అయితే ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్‌ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించినవారే. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖ రాసింది. అందులో కొందరు తదుపరి దశల కౌన్సెలింగ్‌ తప్పుకోగా, ఏడుగురు విద్యార్థులైతే మేనేజ్‌మెంట్‌ కోటా కింద దరఖాస్తే చేసుకోలేదని వర్సిటీకి తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలున్నట్టు గుర్తించిన కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌ కుమార్‌.. లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా వరంగల్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషికి సోమవారం ఫిర్యాదు చేశారు. 

సీట్ల భర్తీ ఇలా.. 
ప్రైవేట్‌ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లలో సగం కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తుంది. వాటికి అతితక్కువ ఫీజు ఉంటుంది. మిగతా సగం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో తిరిగి మూడు (1, 2, 3) కేటగిరీలు ఉంటాయి. ఇందులో కేటగిరీ–1 సీట్లు సగం (మొత్తం సీట్లలో 25శాతం) ఉంటాయి. వార్షిక ఫీజు రూ.24 లక్షలు ఉండే ఈ సీట్లను కూడా ప్రభుత్వ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. ఇక కేటగిరీ–2 సీట్లు 30శాతం (మొత్తం సీట్లలో 15శాతం), కేటగిరీ–3 సీట్లు 20శాతం (మొత్తం సీట్లలో 10శాతం) ఉంటాయి. కేటగిరీ–2 సీట్లలో ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్‌ విద్యార్థులకు.. కేటగిరీ–3 సీట్లను మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు తమకు ఇష్టమొచ్చినవారికి కేటాయించుకోవచ్చు. ఈ రెండింటికీ అధికారికంగా రూ.72 లక్షలు ఫీజు ఉన్నా.. రూ.రెండు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. కేటగిరీ–1 సీట్లలో చేరిన ఏ విద్యార్థి అయినా తమ అడ్మిషన్‌ను వదులుకుంటే, కాలేజీలు ఆ సీటును కేటగిరీ–2 (ఎన్నారై కోటా) కింద భర్తీ చేసుకోవచ్చు. అంతమేర భారీగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు. దీనినే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. 

రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం 
రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీటు వచ్చేందుకు సరిపడా మెరిట్‌ ఉన్నా.. ఇతర రాష్ట్రాల ర్యాంకర్లు రావడంతో మనవాళ్లకు సీట్లు దక్కడం లేదు. ఇతర రాష్ట్రాలవారు వచ్చి వదిలేసి వెళ్లిపోతుండటం.. ఆ సీట్లను మేనేజ్‌మెంట్లు అమ్మేసుకుంటుండటంతో.. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ దందాతో పలుకాలేజీలు రూ.100 కోట్ల దాకా అక్రమంగా వెనకేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు రాజకీయంగా పలుకుబడి కలిగినవారు కావడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

బ్లాక్‌ చేసేది ఎలాగంటే..? 
సాధారణంగా ఎక్కువ ర్యాంకు ఉన్నవారికి కౌన్సెలింగ్‌లో మొదట సీట్లు కేటాయిస్తారు. దీనితో టాప్‌ ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మెడికల్‌ కాలేజీలు డబ్బులతో గాలం వేస్తున్నాయి. తమ కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటా (కేటగిరీ–1) సీటుకు దరఖాస్తు చేసుకుని, అలాట్‌మెంట్‌ అయ్యాక వదిలి వెళ్లిపోయేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఆ సీటు ఎన్నారై కోటా (కేటగిరీ–2) కిందికి మారుతుంది. దానిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. 

► ఇక్కడ దరఖాస్తు చేయిస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో చాలా వరకు వారి రాష్ట్రాల్లోని మెడికల్‌ కోర్సుల్లో చేరినవారే ఉంటున్నారు. అయితే అక్కడి కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తెచ్చుకుని.. మన రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సీటు వచ్చాక క్యాన్సిల్‌ చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తమకు భారీగా లాభం వస్తుండటంతో మేనేజ్‌మెంట్లు వారికి ఐదారు లక్షలదాకా ముట్టజెపుతున్నట్టు సమాచారం. 
►  ఎవరైనా విద్యార్థి అడ్మిషన్‌ అయ్యాక సీటును వదులుకుంటే.. హెల్త్‌ వర్సిటీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును కూడా కాలేజీల యాజమాన్యాలే వారి పేరిట కట్టేస్తున్నట్టు తెలిసింది.
►  మన రాష్ట్రంలోని కొందరు టాప్‌ ర్యాంకర్లలో కొందరు ఇప్పటికే జాతీయ స్థాయి కాలేజీల్లో చేరినా.. ఇక్కడ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు దరఖాస్తులు చేసినట్టు తెలిసింది. ఇదంతా కేవలం పీజీ సీటును బ్లాక్‌ చేసే ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు