విద్యుత్‌ షాక్‌కు గురైన బాలుడు, పరిస్థితి విషమం

19 Jan, 2021 16:08 IST|Sakshi

భైంసా: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీకి చెందిన అభిలాష్‌ అనే బాలుడు పతంగులు ఎగరేస్తూ విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్‌.. విద్యుత్‌ తీగలకు గాలిపటం తట్టుకోవడంతో దాన్ని విడిపించే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు బాలుడిని సమీపంలోని ఏరియా అసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు.

సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి ఇంటి డాబాపై గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్‌.. విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడిపోయాడు. విద్యుత్‌ తీగలు బాలుడికి అతుక్కుపోవడంతో తీవ్ర రక్తస్రావమై, చావుబతుల మధ్య కొట్టిమిట్టాడాడు. కరెంటు తీగలు రేకులపైనే ఉండటంతో బాలుడిని కాపాడే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. దయనీయ పరిస్థితిలో బాలుడు రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారని కలచి వేసింది. కాగా, అభిలాష్‌ విద్యుత్‌ షాక్‌కు గురైన సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేరు.  

మరిన్ని వార్తలు