సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్ క్షిపణిలో అమర్చే కీలకమైన స్వదేశీ తయారీ బూస్టర్ పరీక్ష విజయవంతమైంది. ఈ బూస్టర్తోపాటు ఎయిర్ఫ్రేమ్ సెక్షన్, మరికొన్ని ఇతర భాగాలనూ పూర్తిగా భారత్లోనే తయారుచేశారు. వీటిని అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ పరీక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు ధ్వని వేగం కంటే 2.8 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు కావాల్సిన బూస్టర్లు, ఇతర పరికరాలను దేశీయంగానే తయారుచేసుకొనే వీలు కలుగుతుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. డీఆర్డీవో, బ్రహ్మోస్ బృందాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.