ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి.. 52 గ్రామాలకు రాకపోకలు బంద్‌

19 Oct, 2022 08:19 IST|Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలోని అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి కూలిపోవడంతో కాగజ్‌నగర్‌, దహేగం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో, 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

అయితే, గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో, బ్రిడ్జి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, వాహనల రాకపోకలు లేకపోవడంతో పెను ‍ప్రమాదం తప్పింది. మరోవైపు.. కూలిన బ్రిడ్జిని తొందరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు