27 ఏళ్ల తర్వాత.. ఫేస్‌బుక్‌ ద్వారా

3 Jul, 2021 07:52 IST|Sakshi

మంచిర్యాలరూరల్‌ (హాజీపూర్‌): వారు అన్నదమ్ములు.. చిన్నప్పుడే విడిపోయారు.. ఇన్నాళ్లు ఎక్కడు న్నారో ఏమయ్యారో తెలియదు. 27 ఏళ్ల తర్వాత  వారిని ఫేస్‌బుక్‌ కలిపింది.

తల్లిదండ్రులు చనిపోవడంతో... 
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం నంనూర్‌ గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య, శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు గురువయ్య, లక్ష్మణ్, సతీశ్, కూతురు రమ్య ఉన్నారు. 27 ఏళ్ల క్రితం శంకరయ్య, శంకరమ్మ దంపతులు రెండేళ్ల వ్యవధిలో చనిపోయారు. పిల్లల పోషణ బాధ్యతలను బంధువులు తలా ఒకరు తీసుకున్నారు. అప్పుడు రెండేళ్ల వయసున్న రమ్య బాధ్యతను శంకరయ్య సోదరుడు తీసుకోగా..అప్పటికి 15 ఏళ్ల వయసున్న గురువయ్య లక్సెట్టిపేటలోని బంధు వుల వద్ద, మిగతా ఇద్దరు నంనూర్‌లోనే బంధువుల వద్ద ఉండిపోయారు. గురువయ్య కొన్నాళ్లు బంధువుల వద్ద ఉండగా.. వారి ఇబ్బందులు, వేధింపులు తట్టుకోలేక చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వరంగల్, హన్మకొండలలో హోటళ్లలో పనిచేస్తూ వంట మాస్టర్‌గా పేరు సంపాదించి చివరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. 

చిన్ననాటి ఫొటోతో గుర్తించి..
చిన్నవాడైన సతీశ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ మెరుగైన స్థితిలో ఉన్నాడు. తన ఇంటి పేరుతో ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఉన్నారా అని సతీశ్‌ వెతకగా ఓ వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి ప్రొఫైల్‌ చూడగా..అందులో ఓ ఫొటో సతీశ్‌ వద్ద ఉన్న ఓ ఫొటో రెండూ ఒకేలా ఉండటంతో అతడి నుంచి వెంటనే ఫోన్‌ నంబర్‌ తీసుకుని వివరాలు తెలుసుకోవడంతో అతను తన పెద్దన్నయ్య గురవయ్య అని నిర్ధారణకు వచ్చాడు. తన రెండో సోద రుడు లక్ష్మణ్‌కు చెప్పి ఇతర బంధువులతో కలసి శుక్రవారం హుస్నాబాద్‌కు వెళ్లి సోదరుడిని కలుసు కుని అతడిని నంనూర్‌ గ్రామానికి తీసుకువచ్చారు. బంధువులందరూ గురువయ్యను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. 

మరిన్ని వార్తలు