26న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ 

15 Mar, 2023 03:47 IST|Sakshi

భారీగా పార్టీలోకి చేరికలు.. 

ఎన్సీపీ నేతలతో కేసీఆర్‌ మంతనాలు 

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)లోకి మహారాష్ట్రకి చెందిన వివిధ పార్టీల నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న మహారాష్ట్రలోని కాందార్‌ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇప్పటికే నాందేడ్‌లో భారీ బహిరంగ సభ జరిపిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇది మహారాష్ట్రలో రెండో సభ కానుంది. మంగళవారం ఆ రాష్ట్రానికి చెందిన మహారాష్ట్ర నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వచ్చారు.

మహారాష్ట్ర సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్‌ గిసేవాడ్‌ (ఈయన భోకర్‌ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అశోక్‌ చౌహాన్‌ మీద కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు), ఎన్సీపీ నాందేడ్‌ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ యూత్‌ సెక్రటరీ శివరాజ్‌ ధోంగే, ఎన్సీపీ నాందేడ్‌ అధ్యక్షుడు శివదాస్‌ ధర్మపురికర్, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మనోహర్‌ పాటిల్‌ భోసికర్, ఎన్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ సునీల్‌ పాటిల్, లోహ ప్రాంత అధ్యక్షుడు సుభాష్‌ వాకోరే, కాందార్‌ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్‌ సభ్యులు అడ్వొకేట్‌ విజయ్‌ ధోండగే, ఎన్సీపీ యూత్‌ ప్రెసిడెంట్‌ హన్మంత్‌ కళ్యాంకర్, ప్రవీణ్‌ జాతేవాడ్, సంతోష్‌ వార్కాడ్, స్వాప్నిల్‌ ఖీరే తదితరులు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే, నాందేడ్‌ ఇన్‌చార్జి జీవన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు