ఈసీ‌గా బాధ్యతలు చేపట్టిన పార్థసారథి

10 Sep, 2020 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ, దాని విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి వ్యాఖ్యానించారు. కమిషన్‌ గౌరవాన్ని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, జిల్లాల ఎన్నికల యంత్రాంగం సహకారం, సమన్వయంతో పనిచేస్తామని వెల్లడించారు.

బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని చాంబర్‌లో ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో రాజ్యాంగం ప్రకారం గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే గురుతర రాజ్యాంగ బాధ్యతను నిర్వహించే అవకాశాన్ని కల్పించిన గవర్నర్, సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు..’అని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ప్రథమ ప్రాధాన్యత
ఇక 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పదవీ కాలం ముగియనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించటమే తన ప్రథమ ప్రాధాన్యత అని.. త్వరలోనే జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అలాగే ఏప్రిల్‌లో పదవీ కాలం ముగియనున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. (మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ అరెస్ట్‌)

మరిన్ని వార్తలు