తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పుందంటే..

19 Mar, 2021 11:38 IST|Sakshi

రాష్ట్ర అప్పులు 2.86 లక్షల కోట్లు

ప్రతి ఒక్కరి మీద రూ. 81,935 తలసరి అప్పు 

గత ఏడాది తలసరి అప్పు రూ. 65,840 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి. ఈ ఏడాది బడ్జెట్‌ రూ.2.30 లక్షల కోట్లు కాగా... మొత్తం అప్పులు రూ.2.86 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.2.45 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41 వేల కోట్లు పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.81,395 అప్పు ఉన్నట్లు. గత ఏడాది తలసరి అప్పు రూ.65,480 కాగామరో రూ.16 వేలు పెరిగింది.  

రూ.2.44 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్‌లోనే..
రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్‌ ద్వారానే సేకరిస్తోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌ రుణాల చిట్టా రూ.2.44 లక్షల కోట్లకు (వచ్చే ఏడాది ప్రతిపాదనలతో కలిపి) చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,852 కోట్లు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో రూ.19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్టు బడ్జెట్‌ గణాంకాలు చెపుతున్నాయి. గత ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021–22 ముగిసేనాటికి ఇది రూ.2.86 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఆరేళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాలా లక్షా యాభై ఏడు వేల కోట్ల రూపాయలన్న మాట.  

చదవండి: మందు బాబులపైనే సర్కారు ఆశలు..!

మరిన్ని వార్తలు