మూసీలో కొట్టుకుపోయిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

1 Sep, 2021 10:15 IST|Sakshi
కారును బయటకు తీస్తున్న గ్రామస్తులు, (ఇన్‌సెట్‌) ప్రాణాలతో బయటపడ్డ ప్రకాష్

అడ్డుకొని బయటకు తీసిన స్థానికులు

అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి సురక్షితం

సాక్షి, వికారాబాద్‌: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మూసీ(వాగు)లో ఓ కారు కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి అడ్డుకోవడంతో అందులోని వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చించల్‌పేట వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. వికారాబాద్‌ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ప్రకాష్‌ తన కారులో చించల్‌పేట మీదుగా నవాబుపేటకు వెళ్తున్నాడు. అప్పటికే మూసి వాగులో నీరు పారుతోంది. నీటి ప్రవాహం తక్కువగా ఉందని భావించిన ఆయన అలాగే కారును ముందుకు పోనిచ్చాడు.

మధ్యలోకి వెళ్లగానే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాహనం నెమ్మదిగా కొట్టుకుపోసాగింది. గమనించిన చించల్‌పేట గ్రామస్తులు అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. తాళ్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. దీంతో కారులో ఉన్న ప్రకాష్‌ క్షేమంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ బుచ్చయ్య, ఎస్‌ఐ వెంకటేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రకాష్‌ను రక్షించిన చించల్‌పేట గ్రామస్తులను ఈ సదర్భంగా అభినందించారు. నీరు ఉధృతిగా ఉన్నప్పుడు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు.
చదవండి: లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..!

మరిన్ని వార్తలు