కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు.. ఐపీసీ 506 సెక్షన్‌ కింద బుక్‌

7 Mar, 2023 12:04 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్‌, ఆయన తనయుడిని ఫోన్‌లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ వన్ టౌన్లో సుధాకర్‌ తనయుడు సుహాన్‌ నిన్న(సోమవారమే) ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపులు)తో పటు పలు సెక్షన్ల కింద‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

టీపీసీసీ ఉపాధ్యక్షుడైన డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ఆయన తనయుడు డాక్టర్‌ సుహాస్‌ను.. తన(కోమటిరెడ్డి) వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతో చేసినవేనని, తనపై విమర్శలు చేయొద్దని మాత్రమే సుధాకర్‌ కొడుక్కి చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.

అంతేకాదు.. సంభాషణల్లో కొన్ని మాటలనే కట్‌ చేసి.. ఆడియోను లీక్‌ చేశారని, కాల్‌ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫోన్‌ సంభాషణను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపించారు చెరుకు సుధాకర్‌. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారాయన.

మరిన్ని వార్తలు