Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

20 Feb, 2022 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్‌ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది.

ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన రాజాసింగ్‌పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది.

చదవండి: (రాజాసింగ్‌ వార్నింగ్‌: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే)

అయితే గడువులోగా రాజాసింగ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు