Sujana Chowdary: ‘సుజనా’ సహకరించలేదు.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ

11 Jul, 2021 04:14 IST|Sakshi

వారి కంపెనీల్లో 278 రబ్బర్‌ స్టాంపులను సీజ్‌ చేశాం: సీబీఐ

సాక్షి, హైదరాబాద్‌: సుజనా గ్రూపు కంపెనీలు అనేక బ్యాంకుల నుంచి దాదాపు రూ.5 వేల కోట్ల  అక్రమ  రుణాలు తీసుకుని అనేక షెల్‌ కంపెనీలకు తరలించాయంటూ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. కేసు విచారణలో భాగంగా సుజనా గ్రూపు కంపెనీల చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వై.సుజనాచౌదరికి 2019లో నోటీసులు జారీ చేయగా రెండు పర్యాయాలు హాజరైనా దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొంది. సుజనా గ్రూప్‌ కంపెనీల్లో సోదాలు జరపగా అనేక ఒరిజినల్‌ పాన్‌కార్డులు, 278 రబ్బర్‌ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది.

వీటిని పరిశీలిస్తే అనేక బినామీ, డమ్మీ కంపెనీలను ఇక్కడి నుంచే నడిపిస్తున్నట్లుగా ప్రాథమికంగా తేలిందని పేర్కొంది. సుజనాచౌదరి ఇంటిలోనూ బ్యాంకు రుణాల కీలక సమాచారం లభించిందని తెలిపింది. సీబీఐ అధికారులు తనకు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుజనాచౌదరి గతేడాది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది.

ఓ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మధ్యం తర పిటిషన్‌ను న్యాయమూర్తి ఇటీవల విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు సుజనాచౌదరి అమెరికాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

అనేక అక్రమాలు వెలుగుచూశాయి...
‘బెస్ట్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ అనే క అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాల ను బట్టి తెలుస్తోంది. సుజనాచౌదరికి అమెరికా తోపాటు అనేక దేశాల్లో సబ్సిడరీ కంపెనీలున్నాయి. వీరికి చెందిన షెల్‌ కంపెనీలు అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం లో ఆయన అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తే అక్క డి కంపెనీల ప్రతినిధులను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదు కాబట్టి ఈ కేసుతో నాకు సంబంధం లేదని సుజనా అనడానికి వీల్లేదు. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని వివరాలు ఉండాల్సిన అవసరం లేదు.  మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మరోసారి విచారించాల్సి ఉం ది. ఈ దశలో అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగే అవకాశముంది’  అని సీబీఐ వివరించింది. అయితే ఆయన అమెరికాకు వెళ్లేందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ తిరిగి వచ్చిన వెంటనే సీబీఐ అధికారులకు సమాచారం ఇవ్వాలని సుజనాను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు