హైదరాబాద్‌-ముంబై మధ్య బుల్లెట్‌ రైలు

31 Oct, 2020 01:48 IST|Sakshi

డీపీఆర్‌ తయారీకి బిడ్ల ఆహ్వానం 

ది నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–ముంబై మధ్య బుల్లెట్‌ రైలు కారిడార్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి తాజాగా బిడ్లు పిలిచారు. దేశంలో హై స్పీడ్‌ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ఈ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నవంబర్‌ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్‌ 11 నుంచి టెండర్‌ పత్రాల దాఖలు మొదలుకానుంది. నవంబర్‌ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్‌ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు. 

ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ముందుకు..
హైదరాబాద్‌ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్‌ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తొలి బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ ముంబై– అహ్మదాబాద్‌ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్‌సర్‌–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్‌పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్‌ మార్గాలను హై స్పీడ్‌ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయిం చింది. వీటి డీపీఆర్‌ల ప్రక్రియ ప్రారంభం కావటం విశేషం. చెన్నై– మైసూరు, వారణాసి–హౌరా ప్రాజెక్టులు కూడా ఉన్నా, వాటి డీపీఆర్‌ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌– నాగ్‌పూర్, హైదరాబాద్‌–చెన్నై సెమీ హైస్పీడ్‌ కారిడార్లకు సం బంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ కారిడార్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు