27 మందికి పోలీస్‌ పతకాలు

15 Aug, 2021 03:29 IST|Sakshi

వివిధ కేటగిరీల్లో ప్రకటించిన కేంద్ర హోంశాఖ 

దేశవ్యాప్తంగా 1,380 మంది పోలీసుల ఎంపిక 

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్‌ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్‌ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

పోలీస్‌ సేవా పతకాలు...
ఇంటెలిజెన్స్‌ డీఐజీ శివకుమార్, మాదాపూర్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐబీ అదనపు ఎస్‌పీ డి.రమేష్, వరంగల్‌ ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి, మాదాపూర్‌ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్‌పీ ఎం.పిచ్చయ్య, టీఎస్‌ఎస్‌పీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కె. సంపత్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐబీ ఏఎస్‌ఐలు ఆనంద్‌కుమార్, డి. చంద్రశేఖర్‌ రావు, గ్రేహౌండ్స్‌ సీనియర్‌ కమాండో మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ, కాచిగూడ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం. అనిల్‌గౌడ్‌కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. 

పీఎంజీ విభాగంలో... 
గ్రేహౌండ్స్‌ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్‌ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్‌ఎస్‌ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్‌ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్‌ఎస్‌ఐ పి.కె.ఎస్‌. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్‌.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్‌రావు, జి. ప్రతాప్‌సింగ్, కె. వెంకన్న, మాలోత్‌ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్‌ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్‌తో పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్‌ఐ గుర్రం కృష్ణప్రసాద్‌ ఉన్నారు. 

జైళ్ల విభాగంలో ముగ్గురికి... 
జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్‌ హెడ్‌వార్డర్‌ బి.నారాయణ, హెడ్‌ వార్డర్‌ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. 

మరిన్ని వార్తలు