పలువురికి గాయాలు
చేవెళ్ల: అతివేగం.. ఏడు కార్లను ధ్వంసం చేయగా పలువురిని గాయపడేలా చేసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆలూరు–అంతారం బస్స్టేజీల మధ్య చోటు చేసుకుంది. చేవెళ్ల నుంచి ఆదివారం వికారాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న ఆరుకార్లు అంతే వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టాయి. కార్లు నుజ్జునుజ్జాయంటే ఏ మేరకు వేగంతో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయలయ్యాయి. ఓ కారులో ఉన్న బాలుడి చేయికి, కాలికి.. ఓ మహిళ తలకు గాయమైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై నుంచి కార్లను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు త్వరగా జరిగితేనే ప్రమాదాల నివారణ సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.