కేంద్రం సెస్‌ తగ్గిస్తే  రూ. 32కే లీటర్‌ పెట్రోల్‌ 

19 Aug, 2021 10:32 IST|Sakshi

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం 

పటాన్‌చెరు: కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గిస్తే పెట్రోల్‌ రేట్లు బాగా తగ్గుతాయని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. పెట్రోల్‌పై సెస్‌ రూపంలో ఆయా సందర్భాల్లో కేంద్రం సొమ్మును వసూలు చేస్తోందని, సెస్‌ అనేది పన్ను కాదని గుర్తించాలన్నారు. కేంద్రం ఇలా ఆయా సమయాల్లో వేసిన సెస్‌ను తొలగిస్తే పెట్రోల్‌ లీటరు రూ.32కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. బుధవారం పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు.

అక్కడి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు అనే మోదీ ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అమలులో వెనుకబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత పేరుతో నోట్లరద్దు అమల్లోకి తేగా, బ్లాక్‌మనీ మొత్తం వైట్‌గా మారిందన్నారు. తనకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని చిదంబరం గుర్తుచేసుకుంటూ.. ఓసారి తాను రూపొందించిన ఓ ముసాయిదా చట్టం ఫైలును పీవీ కనీసం చదవకుండానే సంతకం పెట్టారని అన్నారు. 
 

మరిన్ని వార్తలు