ఎంజీబీఎస్‌లో డ్రైవర్‌ నిర్లక్ష్యం, చిన్నారి మృతి

8 Feb, 2021 10:39 IST|Sakshi
మహ్మద్‌ అహాన్‌ (ఫైల్‌)

బలి తీసుకున్న బస్సు చక్రాలు   

మూడేళ్ల బాలుడి మృత్యువాత  

ఎంజీబీఎస్‌లో దుర్ఘటన 

అఫ్జల్‌గంజ్‌: అప్పటి వరకూ ఆ చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో పయనించాడు. ఆ పయనమే అతనికి మృత్యు గమనమైంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ సభ్యుల్ని తీవ్ర శోకంలో ముంచివేసింది. ఈ విషాదకర ఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఖలీల్‌కు కుమారుడు మహ్మద్‌ అహాన్‌ (3), ఓ కూతురు ఉన్నారు.

మూడ్రోజుల క్రితం చిన్నారుల అమ్మమ్మ ఊరైన నిజామాబాద్‌కు కుటుంబ సభ్యులతో వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం నిజామాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులో నగరానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం నంబర్‌ 74 వద్ద బస్సు దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి మూడేళ్ల బాలుడు మహ్మద్‌ అహాన్‌ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే బస్సును డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వెనక్కు తిప్పాడు. బస్సు గమనాన్ని గమనించని అహాన్‌ దాని చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు తమ కళ్లముందే అసువులు  బాయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  చదవండి: చెన్నైలో కిడ్నాప్‌.. ముంబైలో సజీవదహనం

మరిన్ని వార్తలు