బస్సు చక్రాల కింద నలిగిన బాలుడు 

10 Nov, 2021 01:26 IST|Sakshi
ప్రమాద స్థలంలో తన చిన్నారిని గుండెకు హత్తుకుని రోదిస్తున్న తల్లి  

రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

ఆగ్రహంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన స్థానికులు   

గుడిహత్నూర్‌: అప్పటివరకు కుటుంబ సభ్యులతో గడిపిన బాలుడు ఇంటి ముందు ఉన్న షాప్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆ చిన్నారిని చిదిమేసింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండ లం హనుమాన్‌నగర్‌లో మంగళవారం జరిగింది. హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే అజీజ్‌ –సుల్తానాలకు నలుగురు సంతానం. చిన్నవాడైన అర్మాన్‌ (6) సాయంత్రం సమయంలో ఇంటి ఎదురుగా ఉండే కిరాణా దుకాణం వైపు పరిగెత్తాడు.

రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన (ఉట్నూర్‌– ఆదిలాబాద్‌ వన్‌స్టాప్‌) ఆర్టీసీ బస్సు చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. బస్సు వేగంగా ఉండటంతో ముందు చక్రాలతోపాటు వెనుక చక్రాలు కూడా బాలుడిపైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, బస్సును నిర్లక్ష్యంగా నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు