బాల్యం బంధీ..! పసిప్రాయంలోనే పెళ్లిళ్లు

22 May, 2021 11:19 IST|Sakshi

కరోనా వేళ పెరిగిపోతున్న ఘటనలు

మారుమూల ప్రాంతాల్లో అత్యధికం

అడ్డుకుంటున్న షీటీంలు, బాలల పరిరక్షణ విభాగాలు

అయినా నిత్యం ఏదో మూలన..

యాదాద్రి జిల్లాలో 43 పెళ్లిళ్లకు అడ్డుకట్ట

కొన్ని చోట్ల రహస్యంగా ముగిసిన తంతు

సాక్షి, యాదాద్రి: చట్టవిరుద్ధమని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలకు పసిప్రాయంలోనే పెళ్లి చేస్తున్నారు. మంచి సంబంధం వచ్చిందని, కట్నకానుకలు లేకుండా దొరికడాని, మేనరికం ఓ కారణమైతే నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లంటే అభద్రతాభావం, సెల్‌ఫోన్‌ చాటింగ్‌లు, టీనేజ్‌లో ప్రేమ మరో కారణంగా తెలుస్తోంది. అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిత్యం ఏదో ఒక మూలన బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో గడిచిన నాలుగేళ్లలో అధికారులు 100 బాల్యవివాహాలను అడ్డుకోగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 43 ఉన్నాయి. కరోనా వేళ కొన్నిచోట్ల గుట్టచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఇలా..
జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్‌ (ఎం), భువనగిరి, సంస్థాన్‌ నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హైసూ్కల్‌ స్థాయిలోనే బాలికలకు పెళ్లి చేస్తున్నారు. లో కం తెలియని వయసులో పెళ్లి చేయడం ద్వారా భార్యభర్త మధ్య వివాదాలు తలెత్తి విడాకులకు దారి తీస్తు న్నాయి. దీంతో మైనార్టీ వయస్సులోనే పెళ్లి పెటా కులవుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీ స్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం, టీషీం అధికారులు విశేష కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు  మరింత పెంచాల్సి ఉంది.

బాల్య వివాహాలకు కారణం
బాల్య వివాహాలు జరుగడం వెనక పలుకారణాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో కోవిడ్‌ మరణాల భయం, మంచి సంబంధాల నెపం,  మేనరికం,  లైంగికదాడులు, ప్రేమ వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చిన్నతనంలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. గతంలో గిరిజన తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరగగా ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి.

అధికారుల అనుమతితో!
కోవిడ్‌ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వద్ద తీసుకుంటున్న అనుమతితోనే వివాహం చేస్తున్నారు. ఎవరైనా బాల్య వివాహం ఎలా చేస్తున్నారంటే అనుమతిపత్రం చూపుతున్నారు. శుభలేఖ ఆధా రంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల బోనాఫైడ్‌ సర్టిఫికేట్‌ ఆధారం చూపితే చాల వివాహాలను అడ్డుకోవచ్చు. అయితే అన్ని అనుమతులతోనే వివాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చైల్డ్‌ మారేజ్‌ ప్రొటక్షన్‌ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో జరగుతున్న బాల్య వివాహాల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్, ఆయాలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారం చెబితే  ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది.

అందుబాటులో హెల్ప్‌లైన్‌  నంబర్లు
బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఎలాంటి బిల్లు లేకుండా ఫోన్‌ చేస్తే అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని  అడ్డుకొని కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098, పోలీస్‌ 100, సఖి సెంటర్‌ 181కు ఫోన్‌ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. వివాహం జరిపిన కుటుంబ పెద్దలు, పెళ్లి పెద్ద, పురోహితుడు, వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు, వివాహానికి సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారు.

బాల్య వివాహాలు నేరం
10 తరగతి పూర్తికా గానే వివాహం చేస్తున్న ఘట నలు వెలుగు చూస్తున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాం. సఖి కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, అక్రమ దత్తతపై సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను జూమ్‌ మీటింగ్‌ ద్వారా కోరాం. హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాం. బాల్య వివాహాలు చేస్తే చర్యరీత్యా నేరం.  
- బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌

సమాచారం ఇవ్వాలి
ఎక్కడైనా బాల్యవివాహా లు చేస్తున్నా, అందుకు ప్రయత్నం జరుగుతున్నా  వెంటనే సమాచారం ఇవ్వాలి. షీటీం, బాలల పరిరక్షణ విభాగం వెంటనే అక్కడికి చేరుకుంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చిన్నతనంలో పెళ్లి చేయడం నేరం. కోవిడ్‌ సమయంలో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రొహిబిషన్‌ అధికారులను జూమ్‌ మీటింగ్‌ ద్వారా కోరాం. జిల్లాలో బాల్య వివాహాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. 
- పి.సైదులు, డీసీపీఓ

మరిన్ని వార్తలు