హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్‌ లేదా.. నో ప్రాబ్లమ్‌!

16 Mar, 2022 11:44 IST|Sakshi
నర్సింహులగూడెంలో ఫోన్‌ పే స్కానర్‌తో వెరైటీగా చిన్నారులు

సాక్షి,ఖమ్మం: పెద్ద నోట్ల రద్దు, ఆపై కరోనాతో నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. షాపింగ్‌ మాళ్లు మొదలు తోపుడు బండ్ల వ్యాపారులకు వరకు అందరూ ఫోన్‌ పే, గూగుల్‌ పేలతో నగదు స్వీకరిస్తున్నారు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా గ్రామాల్లో పిల్లలు మామూళ్ల కోసం వెళ్తూ ఫోన్‌ పే స్కానర్‌ వెంట తీసుకెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో మంగళవారం ఈ  దృశ్యం కనిపించింది.

సూది తెచ్చుకుంటేనే టీకా!
సత్తుపల్లి టౌన్‌ : ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగతా విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కాన్పు అయిన శిశువులకు 24 గంటల్లోపు బీసీజీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఈ టీకా చిన్నారుల్లో క్షయవ్యాధి రాకుండా కాపాడుతుంది. అయితే, 0.01 ఎంఎల్‌ సిరంజీతో మాత్రమే శిశువులకు వ్యాక్సిన్‌ వేయించాల్సి ఉండగా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు వారాలుగా అరకొరగా సరఫరా అవుతున్నాయి.

దీంతో సిరంజీలు లేవని సిబ్బంది చెబుతుండగా. తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు వెళ్లిల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఏరియా ఆస్పత్రుల్లో జరిగే వ్యాక్సినేషన్‌కు వచ్చే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఎం.రాజేష్‌ను విరణ కోరగా సిరంజీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు