పవర్‌ హౌజ్‌ అధికారులకు సీఐడీ ప్రశ్నలు

25 Aug, 2020 11:41 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ప్యానల్ బోర్డులో వచ్చిన మంటలపై దర్యాప్తు కొనసాగుతోంది. 220 కేవీ డీసీ విద్యుత్ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్టు అంచనాకొచ్చింది. అయితే, అర్ధరాత్రి బ్యాటరీలు ఎందుకు బిగించాల్సి వచ్చింది? అధికారులు, సీఈలు లేకుండా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేశారు? బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదు? బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని శ్రీశైలం విద్యుత్ అధికారులను సీఐడీ బృందం ప్రశ్నించింది. దాంతోపాటు చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలను సేకరించింది.
చదవండి: కొంపముంచిన అత్యవసర స్విచ్‌!)

కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్‌కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్‌ కాయిల్స్‌ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని  అధికారులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు