నాగర్‌కర్నూల్‌లో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య ఘర్షణ

7 Jan, 2023 13:41 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మార్కండేయ రిజర్వాయర్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

అయితే, మార్కండేయ లిఫ్ట్‌ పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్థన్‌ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. నాగం జనార్థన్‌ రెడ్డితో పాటుగా కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడకి వచ్చేందుకు వీలులేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. 

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల దాడులపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా పనులు చేస్తున్నప్పుడు తమను అడ్డుకోవాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. దాడి ఘటన తర్వాత కాంగ్రెస్‌ నేతలు, నాగం అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు