యూజ్ లెస్ ఫెలో: బీజేపీ కార్పొరేటర్లపై మేయర్‌ దూషణ

27 Jan, 2021 17:08 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. బీజేపి, టీఆర్ఎస్ కార్పొరేటర్‌లు బాహాబాహీకి దిగారు. నినాదాలు, ప్రతినినాదాలు వాగ్వివాదంతో సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. మేయర్ సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్‌లను యూజ్ లెస్ ఫెలో అని దూషించడం వివాదాస్పదంగా మారింది. మేయర్ అద్యక్షతన కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభం కాగానే బిజేపి కార్పొరేటర్‌లు ఎండిపోయిన హరితహారం మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. హరిత హారం అక్రమాలకు నిలయంగా మారిందని, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను ఎందుకు రక్షించడంలేదని పోడియం వద్దకు దూసుకెళ్లి మేయర్‌ను నిలదీశారు. చదవండి: వ్యాక్సిన్‌కు జై కొట్టిన తెలుగు ప్రజలు

దీంతో మేయర్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్‌లు పోడియం వద్దకు వచ్చి బీజేపీ కార్పొరేటర్‌లతో వాగ్వివాదానికి దిగారు. నినాదాలు, ప్రతి నినాదాలతో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మేయర్ సహనం కోల్పోయి బీజేపి కార్పొరేటర్ జితేందర్‌ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని దూషించడంతో బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేయర్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆధిపత్యం కోసం ఇరుపార్టీలు ప్రయత్నిస్తు ప్రజాసమస్యలను పక్కదారి పుట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సమావేశంలో సైతం ఇలానే బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ లు గొడవపడి సమావేశాన్ని రసాభాసగా మార్చారు. చదవండి: చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు

మరిన్ని వార్తలు