క్లాస్‌మేట్‌ అని జాబ్‌ ఇప్పించి.. లవ్‌యూ అంటూ సహజీవనం.. తర్వాత..

8 Dec, 2022 11:32 IST|Sakshi

జమ్మికుంట: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తోంది. ఈ ఘటన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. 

బాధితురాలు ఆస్మాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగిరిషరీఫ్‌ గ్రామానికి చెందిన రాచపల్లి మధు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడవి చెల్పూర్‌ గ్రామానికి చెందిన ఎండీ.ఆస్మాబేగం కలిసి 2017 వరకు వర్ధన్నపేటలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివారు. ఈ సమయంలో మధు, ఆస్మాబేగం ప్రేమించుకున్నారు. తరువాత హైదరాబాద్‌లోని మధు స్నేహితుడి రియల్‌ ఎస్టేట్‌ అఫీస్‌లో ఆస్మాబేగంకు ఉద్యోగం ఇప్పించాడు. ఈ సమయంలో రెండేళ్లు సహజీవనం చేశారు. 

కొద్ది రోజుల క్రితం వ్యవసాయం చేసుకుంటానని బీజిగిరిషరీఫ్‌కు వచ్చిన మధు మరో యువతితో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆస్మాబేగం ముడు రోజులుగా మధు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేసింది. కాగా.. మధు కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి పరారీలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు