కొత్తరాతి యుగానికి చెందిన మట్టిబొమ్మ

27 Nov, 2022 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రాతి యుగానికి చెందిన అరుదైన మట్టిబొమ్మ సిద్దిపేటలో దొరికింది. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారు పాటిగడ్డలో కొలిపాక శ్రీనివాస్‌ ఈ బొమ్మను గుర్తించారు. ఆదిమానవులకు సంబంధించిన అనేక ఆధారాలను అందించిన నర్మెట్టలోనే ఇదీ దొరకటం విశేషం.

క్రీ.పూ.6­500 నుంచి క్రీ.పూ.1800 మధ్య కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ మట్టి బొమ్మ కొంతమేర విరిగి ఉంది. 6సెం.మీ. పొడవున్న ఈ బొమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకులు కర్ణాటకకు చెందిన రవి కొరిసెట్టర్‌ చెప్పారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనీ్వనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న మెహర్‌ఘర్‌ ప్రాంతంలో గతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన బొమ్మలను ఇది పోలి ఉందన్నారు. నంగునూరు–నర్మెట్ట మధ్య 6కి.మీ. పరిధిలో ఆదిమానవుల మనుగడను రూఢీ చేసే ఆధారాలు విస్తారంగా వెలుగు చూస్తున్నాయని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
చదవండి: వచ్చేస్తున్నాయ్‌.. కల్యాణ ఘడియలు

మరిన్ని వార్తలు