ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

22 Mar, 2021 12:54 IST|Sakshi

ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం

పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపుదంపతులైన ఉద్యోగులకు అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

అలానే ‘‘హోంగార్డులు, వీఏవో, వీఆర్‌ఏ, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీ, విద్యా వాలంటీర్లు, సెర్ప్‌ సిబ్బందికి పీఆర్సీ వర్తింప చేస్తాం. అలానే పెన్షనర్ల వయోపరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తాం. దంపతులైన ఉద్యోగులకు అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నాం. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం అని కేసీఆర్‌ తెలిపారు.

చదవండి: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు