ఆయుష్మాన్‌ భారత్‌: సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

19 May, 2021 03:16 IST|Sakshi

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎంవోయూ

ఆరోగ్యశ్రీతో పాటు అమలుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 

సాక్షి,హైదరాబాద్‌:  పేద ప్రజల వైద్య చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఇక రాష్ట్రంలో కూడా అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వైద్యశాఖ అధికారులు నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఈ నిబంధనలకు లోబడి వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)కు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది.  

‘ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడాన్ని స్వాగతిస్తున్నాం’ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్మాన్‌ భారత్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 19న తలపెట్టిన ‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష‘ను వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: కేసీఆర్‌ పాతాళ భైరవి సినిమాలోలాగా చేస్తున్నారు: భట్టి
తెలంగాణ జూడాలు, హౌస్‌ సర్జన్లకు తీపి కబురు

మరిన్ని వార్తలు