సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగమంటే తెలుగు ప్రజలు ఆసక్తిగా వింటారు. చమక్కులు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. సామెతలతో పాటు తెలంగాణ యాసతో మాట్లాడుతుండడం సీఎం కేసీఆర్ ప్రసంగ శైలి. తాజాగా కరీంనగర్ జిల్లా శాలపల్లిలో సోమవారం జరిగిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ ప్రసంగంలోనూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా మాట్లాడడంతో నవ్వులు విరబూశాయి.
లబ్ధిదారుతో సరదా సంభాషణ
దళిత బందు లబ్ధిదారుగా ఎంపికైన హుజురాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ, ఆమె భర్త మొగిలికి దళితబంధు చెక్కు, లబ్ధిదారు కార్డు సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మైక్ అందుకుని ‘ఏమ్మా ఈ డబ్బులతో ఏం చేస్తావ్’ అని అడగ్గా రాధ డెయిరీ పెట్టుకుంటానని చెప్పింది. ‘పాలు అమ్ముతవా? మంచిగా అమ్ముతవా? పక్కా మాట కదా’ సరదాగా ప్రశ్నించారు. ‘మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్ పొయ్యాలే’ అని సీఎం కేసీఆర్ అనడంతో సభికులతో పాటు సమావేశానికి హాజరైన వారందరూ ఘొల్లున నవ్వారు.
‘వెంకన్న నువ్వు ముందటికుండు’
అంతకుముందు ప్రసంగంలో దళిత బంధుపై పాట రాసిన కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రస్తావన తెచ్చారు. ‘వచ్చిండా వెంకన్న? ఎనకకు ఎందుకు పోయినవ్. నువ్వు ముందటికుండు’ అని చెప్పడంతో గోరటి వెంకన్న లేచి నిలబడ్డారు. ముందు వరసలోకి రమ్మని విజ్ఞప్తి చేసినా వెంకన్న రాలేదు. ‘మట్టిల్లోంచే సిరులు తీసే మహిమ నీకూ ఉన్నది.. పెట్టుబడియే నీకు వరిస్తే నీకు ఎదురేమున్నది’ అని గోరటి వెంకన్న రాసిన పాటను కొంత ప్రస్తావించారు. అనంతరం మరో కవి రాసిన .. ‘సుక్కల ముగ్గు ఏసినట్టు సెల్లెల.. నువ్వు సక్కంగా కూడబెట్టు సెల్లెల్ల’ అని పాట పాడారు.