వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

11 Sep, 2020 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు‌ శుభవార్త అందించారు. ఉద్యోగులకు పే స్కేల్‌ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్సిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వీఆర్‌ఏలు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్‌ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ  హామీ ఇచ్చారు. కాగా శుక్రవారం నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసందే. (కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం). .

వీఆర్ఏలకు పే స్కేల్‌తో పాటు వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ధన్యవాదాలు : ట్రెసా  
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ  రెవెన్యూ ఉద్యోగుల పని తీరును మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంతోషం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల  సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమపై పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏ లకు పూర్తి వేతనంతో పాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు