50వేల కొలువులకు తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

10 Jul, 2021 10:47 IST|Sakshi

తొలిదశలో భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచన

మలిదశలో ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీఇప్పటికే ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తొలిదశలో 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిం చాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై  సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

ఉద్యోగాల భర్తీలో స్థానికులకు న్యాయం జరగాలనేది తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటి. ఈ నినాదాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఇన్నాళ్లూ జాప్యం జరిగినా, కొత్త విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి.
– సీఎం కేసీఆర్‌ 

గతంలో అంతా అస్తవ్యస్తం
గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్య స్తంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానిం చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమించి, అత్యంత శాస్త్రీయ విధానాన్ని అను సరించి కొత్త జోనల్‌ విధానానికి రూపకల్పన చేసిం దని తెలిపారు. ‘ప్రస్తుతం ఈ కొత్త విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. అన్ని ప్రభుత్వశాఖల్లో నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్ట్ట్‌ రిక్రూట్‌మెంట్‌) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి.

వీటిని తొలి విడతలో భర్తీ చేస్తాం. రెండో విడతలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నింపుతాం. ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ప్రమోషన్ల ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు, వాటి మూలంగా ఏర్పడే ఉద్యోగ ఖాళీలకు సంబంధిం చిన పూర్తి సమాచారంతో నివేదిక తయారు చేసి ఈనెల 13న జరిగే కేబినెట్‌ సమావేశానికి తీసుకు రండి..’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఏ వేవ్‌కైనా సంసిద్ధంగా..

♦ ఇతర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై అధ్యయనం చేయండి 

♦ సరిహద్దు జిల్లాల్లో కూడా మూడురోజులు పర్యటించాలి

♦ కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌కు నివేదిక సమర్పించాలి

♦ కోవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఫీవర్‌ సర్వే  ఏ వేవ్‌ ఎప్పుడు వస్తదో, ఎంతవరకు విస్తరిస్తదో ఎవరికీ తెలియట్లేదు 

♦ మహమ్మారి కట్టడికి ప్రభుత్వంతో కలసి రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి 

>
మరిన్ని వార్తలు