తెలంగాణలో 50 వేల కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు!

13 Dec, 2020 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్‌ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు.
(చదవండి: ఇదేం పనయ్యా.. కానిస్టేబుల్‌!)

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
(చదవండి: 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం)

మరిన్ని వార్తలు