హాలియా చేరుకున్న సీఎం కేసీఆర్

2 Aug, 2021 12:20 IST|Sakshi

సాక్షి, నల్గొండ: బేంగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాలియాకు చేరుకున్నారు. సీఎం రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో సభాస్థలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని, ఆయన గెలిచాక వచ్చి అధికారులతో సమీక్షించి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన సభలో సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికే కొన్నింటికి నిధులు మంజూరు చేశారు. వాటిని సమీక్షించడంతోపాటు చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించనున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించనున్నారు.  

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలు మోహరించాయి. నలుగురు ఐపీఎస్‌ అధికారులు, ఎనిమిది మంది అడిషనల్‌ ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 75 మంది సీఐలు, 300 మంది ఎస్‌ఐలు, 1,680 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ రంగనాథ్‌ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

  

మరిన్ని వార్తలు