ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

25 May, 2021 21:41 IST|Sakshi

దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించే లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలి

జూన్‌ 15 లోపు అంచనాలు పూర్తిచేయాలి

నెల్లికల్‌లో 15 లిఫ్ట్‌ ప్రాజెక్టులకు అంచనాలు తయారుచేయాలి

సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్‌) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇరిగేషన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏలిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ  ఒకేసారి టెండర్లు పిలవాలని  ఇరిగేషన్ శాఖాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వాన కాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సీఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు.

కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ‘‘కాళేశ్వరంతోనే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నాం. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరాం. జూన్‌ 30 వరకు మొదటి దశ చెక్‌డ్యాంలు పూర్తిచేయాలి. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకే అంకితం చేస్తాం. కాల్వల మరమ్మతుల కోసం రూ.700 కోట్లు కేటాయించాం. కాగజ్‌నగర్‌, బెల్లంపల్లిలో లిఫ్ట్‌కు ఆయకట్టు సర్వే చేయాలని’’ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

చదవండి: తెలంగాణ సర్కార్‌కి జూడాల షాక్‌
ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మరిన్ని వార్తలు