ఉప ఎన్నికతో సంబంధం లేదు.. మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్న కేసీఆర్‌

3 Oct, 2022 14:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్‌ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం అఫిషీయల్‌గా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటీకీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. జాతీయ పార్టీ ప్రకటనపై సీఎం కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌.. మునుగోడులో జాతీయ పార్టీతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం కేసీఆర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై కసరత్తులో భాగంగా దసరా(అక్టోబర్‌ 5న) రోజున జరగాల్సిన సర్వసభ్య సమావేశం యథావిధిగాఘ జరుగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికతో సమావేశానికి సంబంధం లేదన్నారు. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానుంది. 

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. మంత్రి జగదీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి. కేంద్రం దుర్మార్గాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు అని కామెంట్స్‌ చేశారు. ఇక, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. అక్టోబర్‌  14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17గా ఉంది. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 

మరిన్ని వార్తలు