రైతు పెద్దవాడే కానీ.. కేసీఆర్‌

31 Oct, 2020 14:19 IST|Sakshi

కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని పిలుపు

సాక్షి, జనగామ : రైతు పెద్దవాడే కానీ కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని  చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
(చదవండి : రైతన్నకు ‘వేదిక’)

ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అందించాలనుకున్నా కేంద్రం ఆక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామంటే ఎఫ్‌సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధాన్యం సన్నవైనా, దొడ్డవైనా రూ.1,880లకే కొనుగోలు చేస్తామని ఎఫ్‌సీఐ చెబుతోందని, అంత కంటే ఎక్కువైతే ధాన్యం సేకరించేదే లేదని ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. రైతు సంఘటితం కావడానికి రైతు వేదిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు