సిద్ధిపేట నేను పుట్టిన జిల్లా: సీఎం కేసీఆర్‌

20 Jun, 2021 15:13 IST|Sakshi

ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించాం

రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాది

సిద్ధిపేట పర్యటనలో సీఎం కేసీఆర్‌

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణలో పండేది మేలైన పత్తి అన్నారు. తెలంగాణలో 400 జిన్నింగ్‌ మిల్లులున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో ఆయన పర్యటించారు. అక్కడ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిద్ధిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు. తెలంగాణ రాకముందే మిషన్‌ కాకతీయ రూపకల్పన చేశామన్నారు. సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘‘ రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాది. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.

అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చాం. రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. ధరణి కోసం మూడేళ్లు శ్రమించాం. రెవెన్యూలో 37 రకాల చట్టాలు ఉన్నాయి.ధరణిలో ఒక్కసారి భూమి ఎక్కిందంటే దాన్ని ఎవరూ మార్చలేరు. మూడు రకాలుగా మాత్రమే భూమి ఇతరులకు మారుతుంది. అమ్మకం, వారసత్వం, గిఫ్ట్‌డీడ్‌.. ఈ మూడు పద్ధతుల్లోనే మారుతుంది. రైతు కుటుంబాలకు రక్షణ కల్పించేందుకు రైతుబీమా పెట్టాం. కేసీఆర్‌ కిట్‌ పథకం తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయని’’ సీఎం కేసీఆర్‌ అన్నారు.

చదవండి: ఈటల దెబ్బకు బయటకొచ్చిన కేసీఆర్‌  
దొర గారికి చీమకుట్టినట్లైనా లేదా? వైఎస్‌ షర్మిల 

మరిన్ని వార్తలు