తండ్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌?

21 Apr, 2021 03:44 IST|Sakshi

మర్కూక్‌ (గజ్వేల్‌): సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ మంగళవారం కలిసినట్లు సమాచారం. కరోనా నిబంధనల మేరకు కేటీఆర్‌ భౌతికదూరం పాటిస్తూ తండ్రిని పలకరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్‌ అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లారని సమాచారం.

సీఎం కోలుకోవాలని పూజలు
యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఉదయం ఆలయ మహా మండపంలో కేసీఆర్‌ గోత్ర, నామాలతో ప్రత్యేకంగా హోమాది పూజలు చేశారు. సమస్త ప్రజానీకం కరోనా నుంచి విముక్తి పొందాలని, వైరస్‌ నివారణ జరగాలని ధన్వంతరి హోమం జరిపించారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో కోలుకోవాలని పూజలు చేసినట్లు ఆచార్యులు తెలిపారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు, ఆలయ అధికారులు

కేసీఆర్‌కు గుత్తా, పోచారం పరామర్శ 
సాక్షి, హైదరాబాద్‌: కరోనా లక్షణాలతో బాధపడుతూ వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఫోన్‌ ద్వారా వేర్వేరుగా పరామర్శించారు. ‘కోవిడ్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. భయపడాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజల దీవెన, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని గుత్తా, పోచారం ఆకాంక్షించారు. సీఎం ఆరోగ్య స్థితిపై మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆరా తీశారు. సీఎం త్వరగా కోలుకుని తిరిగి ప్రజల సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్చకులను కోరారు. నాంపల్లి యూసుఫైన్‌ దర్గాలో మంత్రి మహబూబ్‌అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ

చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం

మరిన్ని వార్తలు